చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ 30 మంది మృతి
ఒక జవాను వీరమరణం

భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
2025లో 71 మంది నక్సల్స్ హతం
నక్సల్స్ రహిత దేశంగా రూపుదిద్దుతామన్న కేంద్రమంత్రి అమిత్ షా
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ బీజాపూర్ లోని బస్తర్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మొత్తం 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు, ఒక డీఆర్జీ జవాను వీరమరణం పొందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీజాపూర్–దంతేవాడ సరిహద్దులో కూంబింగ్ చేపట్టగా నక్సలైట్లు కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు. ఎదురుకాల్పుల్లో 26 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు వివరించారు. కాంకేర్–నారాయణ్ పూర్ సరిహద్దులో మరో ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సలైట్లు మృతిచెందినట్లు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వివరించారు. భారీ ఎత్తున వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నారాయణ్ పూర్–దంతేవాడ సరిహద్దు తుల్తులిలో ఐఇడీ పేలడంతో ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయన్నారు.
ఒక రోజు ముందే అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గంగలూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున నక్సలైట్లు ఉన్నట్లుఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. దీంతో డీఆర్జీ, పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించామన్నారు. కాగా చుట్టుపక్క ప్రాంతాల్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు, ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.
2025లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లు..
– ఫిబ్రవరి 9న బీజాపూర్ జిల్లా ముద్దేడ్–ఫర్సేగఢ్ బోర్డ్ ఎన్ కౌంటర్ లో 31 మంది నక్సలైట్లు మృతి చెందారు.
– ఫిబ్రవరి 2న బీజాపూర్ గంగటూరు ప్రాంతంలో 8 మంది నక్సలైట్లు ఎన్ కౌంటర్ లో మరణించారు.
– 20–21 జనవరిన చత్తీస్ గఢ్–తెలంగాణ సరిహద్దులో కాంకేర్లోని పూజారి గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 18 మంది నక్సలైట్లు మృతిచెందారు.
– 12 జనవరి బీజాపూర్ ముద్దేడ్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా నక్సల్స్ సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు.
– జనవరి 9న సుక్మా–బీజాపూర్ సరిహద్దులో ముగ్గురు నక్సలైట్లు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు.
– జనవరి 6న ఐఈడీ బ్లాస్ట్ లో 8 మంది జవాన్లు మృతి చెందారు.
– జనవరి 4న అబూజ్ మడ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మహిళా నక్సలైట్ సహా ఐదుగురు మృతి చెందారు. ఒక డీఆర్జీ జవాను కూడా మరణించాడు.
2025లో జరిగిన ఎన్ కౌంటర్ లలో మొత్తం 71 మంది నక్సలైట్లు మృతి చెందగా, 290 అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 2024లో 300మంది నక్సలైట్లు హతమయ్యారు.
హోంమంత్రి అమిత్ షా..
కాగా ఈ రెండు ఎన్ కౌంటర్ లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇది భద్రతా దళాల పెద్ద విజయంగా అభివర్ణించారు. నక్సలైట్లపై మోదీ ప్రభుత్వం ఓ వైపు స్పష్టమైన విధానంతో ముందుకు పోతూనే హింసకు పాల్పడే వారి పట్ల మాత్రం కఠిన వైఖరికి కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికైనా నక్సల్స్ తమ విధానాలను మార్చుకొని ప్రభుత్వానికి లొంగిపోయి ప్రజా జీవనంలోకి రావాలన్నారు. మార్చి 31 నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామని పునరుద్ఘాటించారు.