కల్పనా చావ్లా స్మృతులు
Memories of Kalpana Chawla

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా వచ్చారు. కానీ 22 ఏళ్ల క్రితం కల్పనా చావ్లా విషయంలో అలా జరగలేదు. ఆమె భూమిపైకి వస్తున్న అంతరిక్ష నౌక భూమికి మరో 16 నిమిషాలలో చేరుతుందనగా పేలిపోయింది.
కల్పనా చావ్లా తొలిసారిగా 1997 నవంబర్ 19న అంతరిక్షంలోకి వెళ్లారు. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణంలో, ఆమె 372 గంటలు అంతరిక్షంలో గడిపారు. అనంతరం ఆమె 2003 జనవరి 16న రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. 2003 ఫిబ్రవరి 1న భూమికి తిరుగుపయనమయ్యారు. ఆమె వాహక నౌక ఎస్ టీఎస్ 107 టేకాఫ్ సమయంలో ఇంధన ట్యాంక్ పై నుంచి ఇన్సులేటింగ్ ఫోమ్ ముక్కలు షటిల్ ఎడమ రెక్కలను తాకాయి. దీంతో ఇంధన ట్యాంకు పై భాగం అంతరిక్షం నుంచి వాయు మండలం (భూ వాతావరణం)లోకి వస్తుండగా వేగాన్ని, ఉష్ణోగ్రతను తట్టుకోలేకపోయింది. నేరుగా ఆ ఉష్ణోగ్రత ప్రభావం ఇంధన ట్యాంకుపై పడింది. దీంతో ట్యాంకు భారీ ఎత్తున పేలుడుకు గురైంది. దీంతో వాహకనౌక మొత్తం పేలిపోయింది. ఆమె భూమికి చేరుతుందనగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. మొత్తం ఏడుగురు వ్యోమగాములు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
కల్పనా చావ్లా..
కల్పనా చావ్లా 1962 జూలై 1న హరియాణాలోని కర్నాల్ లో జన్మించింది. ఈమెకు చిన్నప్పటి నుంచే విమానాలపై ఆసక్తి. ప్రాథమిక విద్య కర్నాల్ నుంచే అభ్యసించింది. అనంతరం పంజాబ్ లోని ఇంజనీరింగ్ కళాశాలలోఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేసింది. అక్కడి నుంచి 1982లో అమెరికా వెళ్లింది. 1984లో టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. 1986లో రెండో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఇదే రంగంలో పీహెచ్ డీని పూర్తి చేసింది. 1991లో ఈమె అమెరికన్ పౌరసత్వం పొందింది. 1997లో నాసా స్పెషల్ షటిల్ ప్రోగ్రామ్ కు ఎంపికైంది. తొలిసారిగా అదే సంవత్సరం నవంబర్ 19న కొలంబియా స్పేస్ షటిల్ (ఎస్టీఎస్ 87)లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయురాలిగా నిలిచింది. తొలి ప్రయాణంలో 376 గంటలకుపైగా అంతరిక్షంలో గడిపింది. రెండోసారి 2003 జనవరి 16న చావ్లా అంతరిక్షంలోకి వెళ్లింది. అదే సంవత్సరం ఫిబ్రవరి 1న వాహక నౌక ప్రమాదానికి గురై తిరిగి రాని లోకాకేగింది. ఈ ప్రమాదం అప్పట్లు యావత్ భారత్ ను తీవ్ర శోకసాగరంలో ముంచింది.