ఇరాన్ పై దాడికి సిద్ధం ఐదోసారి నెతన్యాహు హై లెవెల్ మీటింగ్
ఇరాన్ పై ఆంక్షలకు అమెరికా సిద్ధం ఉద్రిక్తతలు తగ్గించేందుకు మరోసారి ప్రయత్నం భారతీయులను కలిసిన అధికారులు?

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ పై 300 క్షిపణులతో ఇరాన్ దాడుల అనంతరం ప్రధాని నెతన్యాహు అత్యవసరంగా ఐదోసారి అధికార, సైనిక, పాలనా యంత్రాంగంతో మంగళవారం భేటీ నిర్వహించారు. అందరి సూచనలు సలహాలు దాడులకు ప్రతిజవాబు చెప్పాలని భేటీలో నిర్ణయించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి అనంతరం ఇరాన్ ప్రతిస్పందించి దాడికి దిగింది. అయితే ఇజ్రాయెల్ దాడి చేస్తుందా? లేదా? అనే విషయాన్ని మాత్రం మీడియా వెల్లడించలేదు. నెతన్యాహు వార్ రూమ్ లో రహాస్యంగా ఈ భేటీని నిర్వహించినట్లు వెల్లడించాయి. భేటీ సందర్భంగా పలువురు కేబినెట్ ర్యాంక్ మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం.
మరోవైపు ఇరాన్–ఇజ్రాయెల్ లలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయెల్ కు అమెరికా, నాటోదేశాలు తమ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఉద్రిక్తతలను నిలిపివేసేందుకు తమ మొదటి ప్రయత్నం ఉంటుందని కూడా స్పష్టం చేశాయి.
అయితే మరోమారు ఇజ్రాయెల్ పై దాడికి పూనుకుంటే మాత్రం ఇరాన్ పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాషింగ్టన్ లోనూ హై లేవెల్ భేటీ జరిగింది. ఈ భేటీలో యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ జానెట్ యెల్లెన్ కూడా పాల్గొన్నారు. ఇరాన్ పై పరిమితులకు సంబంధించిన ఆంక్షలు విధించనున్నట్లు పలువురు అధికారులు పేర్కొన్నారు. అయితే దేనికి సంబంధించిన పరిమితులనేది తెలియజేయలేదు.
ఇరాన్ ఓడలో 17 మంది భారతీయులు..
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఓడలో 17 మంది భారతీయులు కూడా ఉన్నారు. భారత్ దౌత్య విధానాల వల్ల భారతీయులను కలిసేందుకు ఇరాన్ ఓకే చెప్పింది. అయితే అధికారులు భారతీయులను సోమవారం కలిసినట్లు తెలిసినా అందుకు సంబంధించిన సమాచారం రహాస్యంగానే ఉంచారు.