ఉక్రెయిన్ పై భారీ వైమానిక దాడి
14 మంది మృతి, 30మందికి గాయాలు

కీవ్: అమెరికా నిఘా సమాచారం అందజేయడం నిలిపివేశాక ఉక్రెయిన్ పై రష్యా భారీ దాడికి పాల్పడింది. శనివారం వేకువజామున జరిగిన ఈ దాడిలో 14 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రష్యా కీవ్ లో వరుస వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో డోబ్రో పిల్యా పట్టణంలోని 8 అపార్ట్ మెంట్లు దెబ్బతిన్నాయి. పలు నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి, నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు. కాగా అగ్నిమాపక శకటం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా రష్యా ఆ వాహనంపై కూడా దాడికి పాల్పడింది. దీంతో ఉక్రెయిన్ లో సంతాప దినంగా పాటించాలని డొనెట్ గవర్నర్ నిర్ణయించారు. వెంటనే రెస్క్యూ చర్యలను ముమ్మరం చేయాలన్నారు. దాడుల్లో ఐదుగురు చిన్నారులు కూడా గాయపడడం విచారకరమని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.