ట్రైన్ హైజాక్ 30మంది జవాన్లు మృతి
30 soldiers killed in train hijack

బెల్టుబాంబులతో బీఎల్ ఎ
కొనసాగుతున్న ఆపరేషన్
బందీలుగా 180మంది సైనికులు
బందీల్లో ఆరుగురు మేజర్లు!
పాక్–చైనాల ఆధిపత్య ధోరణే కారణం
ఆ ప్రాంత సంపద తరలించుకుపోవడమే అంతర్యుద్ధానికి కారణం
ఇస్లామాబాద్: పాక్ ట్రైన్ హైజాక్ లో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుంది. మంగళవారం 450మందికి పైగా ప్రయాణికులు, ఆర్మీ సిబ్బందితో ప్రయాణిస్తున్న ట్రైన్ ను బీఎల్ ఎ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) హైజాక్ చేసింది. పాక్ జైళ్లలో మగ్గుతున్న తమ వారిని విడుదల చేయాలని, బలూచ్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలనే ప్రధాన డిమాండ్ ను తెరమీదకు తీసుకువచ్చింది. లేకుంటే బందీలందరినీ చంపివేస్తామని హెచ్చరించింది. కాగా పాక్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ లో 30 మంది జవాన్లు మృతిచెందగా, వందమంది పౌరులను విడిపించగలిగారు. ఈ ఆపరేషన్ లో 27 మంది బీఎల్ ఎ ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టామని పాక్ సైన్యం ప్రకటించింది. బుధవారం 180 మంది సైనికులు, ఒక మేజర్ (అహ్సాన్ జావిద్) కూడా తమ అదుపులో ఉన్నట్లు బీఎల్ ఎ ప్రకటించింది. అందుకు సంబంధించిన పేర్లతో కూడిన లిస్టును కూడా విడుదల చేసింది. మరోవైపు బీఎల్ ఎ పాక్ సైన్యం చర్యలకు దిగడంతో ట్రైన్ లో బెల్టుబాంబులను ధరించి ట్రైన్ ను పేల్చివేస్తామని హెచ్చరిస్తుంది. దీంతో షాబాజ్ ప్రభుత్వం ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో పడింది.
మేజర్ అహ్సాన్ జావిద్ తోపాటు అతని భార్య, మరో ఆరుగురు మేజర్ ర్యాంక్ అధికారులు ఎసీ స్లీపర్ కోచ్ లో ప్రయాణిస్తున్నారు. వీరందరినీ ఇప్పుడు బీఎల్ ఎ బందీలుగా చేసుకుంది. కాగా ఈ హైజాక్ పై ప్రభుత్వం, భద్రతా చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపహరణకు గురైన జాఫర్ ఎక్స్ ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్ వరకు నడుస్తుంది. బలూచిస్థాన్ గుండా వెళుతుంది.
పాక్–చైనాలపైనే పోరు..
1947 తరువాత తమ ప్రాంతాన్ని బలవంతంగా పాక్ లో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బలూచిస్థాన్ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తుంది. ఇక్కడి ప్రాంతంలో పాక్–చైనాలతో కలిసి చేపడుతున్న అభివృద్ధి ఫలాలను అందించకపోవడం, పాక్ కు తరలించుకుపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో అప్పుడప్పుడు ఈ ప్రాజెక్టులపై భారీ దాడులకు కూడా పాల్పడుతుంది. ముఖ్యంగా బలూచ్ ఆర్మీ గ్వాదర్ పోర్టును లక్ష్యంగా చేసుకుంది. తమ ప్రాంతంలోని విలువైన ఖనిజాలను దోపిడీ చేస్తూ తమ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని బీఎల్ ఎ పేరుతో ఆర్మీని ఏర్పాటు చేసుకొని దశాబ్దాలుగా పోరాటం కొనసాగిస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం ఆరువేల మంది బీఎల్ ఎ ఆర్మీ ఈ పోరాటంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. కాగా ట్రైన్ హైజాక్ లో 500మంది పాల్గొన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయాలు..
బలూచిస్థాన్ కు రావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, అభివృద్ధిలో పాక్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ఉద్యమం మొదలైంది. ఆ ప్రాంతంలోని విలువైన సంపదను తీసుకుంటూ లాహోర్, ఇస్లామాబాద్ లాంటి ప్రాంతాల్లో అభివృద్ధికి వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడం ఇక్కడి ప్రజలకు ఏ మాత్రం రుచించడం లేదు. ఫలితంగా ఇక్కడి ప్రజల్లో పాక్ – చైనాలపై తీవ్ర అసంతృప్తి జ్వాలలను రగిల్చింది. ఫలితంగానే బీఎల్ ఎ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం అన్ని విషయాల్లో బలూచిస్థాన్ కు అధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని చేస్తే ఈ ప్రాంత పోరాటం సమసిపోయినట్లవుతుంది. కానీ పాక్ ప్రభుత్వం ఈ విషయంపై మొండిపట్టుదల వీడడం లేదు.