కేటీపీపీ బిల్లుపై బీజేపీ ఆందోళన
18మంది ఎమ్మెల్యేలు 6 నెలలపాటు సస్పెండ్

బెంగళూరు: ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ అంశంపై శుక్రవారం కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలలపాటు సభా కార్యక్రమాల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ప్రజాప్రతినిధుల జీతాలను పెంచే బిల్లును ఆమోదించారు. బీజేపీ ఎమ్మెల్యేలు భారీ ఎత్తున సభలో నినాదాలు చేపడుతూ నిరసన చేపట్టారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటికి పంపించారు. అనంతరం కేటీపీపీ– కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ సవరణ చట్టాన్ని ఆమోదించారు. దీంతో రూ. 2 కోట్ల సివిల్ పనులలో 4 శాతం, రూ. 1 కోటి వరకు సేవల పనుల్లో ముస్లింలకు వాటా దక్కినట్లయ్యింది. వేతన పెంపు బిల్లు ఆమోదంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్ వంటి ప్రజాప్రతినిధుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన చర్యను బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సీఎం సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు. ముస్లింలను సంతృప్తిపర్చడం కోసం సీఎం కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.