70ఏళ్ల పాలనలో 18వేల గ్రామాలకు విద్యుత్ చేరలే
2.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ ను అందించాం
రూ. 1,22,100 బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
మూడు వందేభారత్ రైళ్ల ప్రారంభం
జైపూర్: విద్యుత్ ప్రాముఖ్యతను కాంగ్రెస్ ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదని, 2014 తమకు అవకాశం వచ్చినప్పుడు దేశంలో 2.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షనే లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 70 సంవత్సరాల పాలనలో 18వేల గ్రామాలకు వీరి ప్రభుత్వం విద్యుత్ ను కేటాయించలేదన్నారు. ప్రధాననగరాలు కూడా విద్యుత్ కోతలతో సతమతం అయ్యేవన్నారు. తమ ప్రభుత్వం ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చిందని మోదీ తెలిపారు. 2.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను అందించామన్నారు. దేశంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు.
పీఎం కుసుమ్ లబ్ధిదారులతో మాటామంతి..
గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లో పర్యటించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ రూ. 1,22,100 బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 42వే లకోట్లతో అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ మహి బన్స్ వారా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బన్స్ వారాలో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రాలలో ఒకటి కానుంది. తొలుత ప్రధాని బన్స్ వారా చేరుకోగానే పీఎం కుసుమ్ లబ్ధిదారులతో మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఊర్జాశక్తి అంటే శక్తితో ముడిపడి ఉన్న అమ్మవారిని పూజిస్తామన్నారు. ఈ రోజున విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాలలో నూతన అధ్యాయం లఖించడం సంతోషకరమన్నారు.
కాంగ్రెస్ పై విమర్శలు..
రాజస్థాన్ను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడం వల్ల కలిగిన గాయాలను మాన్పడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ పేపర్ లీకేజీలకు నిలయంగా మారిందన్నారు. జల్ జీవన్ మిషన్ను కూడా కాంగ్రెస్ అవినీతికి అనువుగా మార్చుకుందని, మహిళలపై దారుణాలు తారాస్థాయికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు.