11 ఏళ్లలో నలుమూలలకు దేశ ఖ్యాతి
మొక్కవోని ధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయాలు
అమెరికాతో తొలగనున్న స్తబ్ధత
చైనా అవకాశ వాదానికి భౌగోళిక చెక్
కాంగ్రెస్ దుర్నీతిని అడుగడుగునా ఎండగడుతున్న ప్రధాని
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: 75వ పడిలోకి అడుగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయనను గద్దెదించాలని ప్రతిపక్షాలు, గిట్టని వారు దేశం లోపల, బయట నుంచి అనేక ప్రయత్నాలను చేశారు. కానీ ప్రధాని మోదీ సుదీర్ఘ దూరదృష్టితో, దేశ ప్రయోజనాలు, ఖ్యాతి కోసం ఒక్కో అడుగు వేసుకుంటూ ఆటంకాలను తొలగించుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే అనేక సాహసోపేతమైన నిర్ణయాలను కూడా ఒంటిచేత్తో ధైర్యంగా తీసుకోగలిగారు. దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రతిపక్షాలు, విదేశాల నోర్లు మూయించగలిగిన దృఢమైన ప్రధానిగా నిలుస్తున్నారు.
హెచ్ 1 బీ వీసాలకు ప్రస్తుతం వచ్చిన ముప్పేం లేదు..
ఉపాధి, ద్రవ్యోల్బణం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఎఐ రంగంతో నిరుద్యోగం నెలకొంటుదన్న స్తబ్ధతను తొలగించగలిగారు. సాంకేతిక నిపుణుల్లో ఉన్న భయాలను తరిమికొట్టారు. ఐటీ సంస్థలు మరింత మున్ముందుకు వెళ్లేందుకు నూతన ఆశలను రేకెత్తించారు. ఇక చైనా, రష్యా లాంటి వాటితో స్నేహహస్తంపై అమెరికా గుర్రుగానే ఉన్నా, దాన్ని కూడా తనదైన శైలిలో దారిలో పెట్టగలిగారు. తద్ఫలితంగా త్వరలోనే అమెరికా సుంకాల భారం తగ్గించే అవకాశం ఉంది. ఇక భారతీయుల వీసాలపై ఉన్న అపోహలు తొలగిపోయినట్లే. ఇప్పటికిప్పుడు హెచ్ 1 బీ వీసాలకు వచ్చిన ముప్పేం లేదు. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్చలు కూడా ఫలప్రదం కావడంతో ఇరుదేశాల మధ్య నెలకొన్న స్తబ్ధత క్రమేణా వీడుతుంది. మోదీ నేతృత్వంలోని అనేక రంగాల అభివృద్ధికి తాత్కాలిక పరిష్కారం కాకుండా, దీర్ఘకాలిక పరిష్కారాలకు చకచకా అడుగులు పడుతున్నాయి. చైనా, అమెరికా అవకాశవాద స్నేహాన్ని ప్రదర్శిస్తున్నా, మోదీ నేతృత్వంలోని భారత్ సూదూర లక్ష్యాలను, దేశ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే ఏ మాత్రం తలొగ్గకుండా ప్రణాళికా బద్ధమైన భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని అవలంభిస్తుంది.
స్వచ్ఛ నిర్ణయాలతో ముందుకు..
మోదీ పదవీకాలంలో అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూనే, మరోవైపు కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యతను తగ్గించగలిగారు. స్వచ్ఛభారత్ లాంటి బృహత్తర కార్యక్రమంతో దేశ వాతావరణాన్ని మెరుగుపర్చగలిగారు. దేశ చివరి గ్రామానికి కూడా మౌలిక సదుపాయాలను పటిష్టం చేయగలిగారు. తద్ఫలితంగా సరిహద్దుల సురక్షితంతోపాటు అక్కడి ప్రజలకు మేలు చేకూరుతుంది. ఆపరేషన్ సిందూర్ తో శత్రుదేశమైన పాక్ కు బుద్ధి చెప్పడమే గాక విదేశాంగ నీతితో ప్రపంచదేశాల్లో పాక్ విధానాన్ని ఎండగలిగారు. అణ్వాయుధాల బెదిరింపులకు భయపడబోని నయాభారత్ గా ప్రపంచానికి చాటిచెప్పారు.
మేక్ ఇన్ ఇండియాతో సార్థకత దిశగా..
ఓటరు యాత్ర, దొంగ ఓట్ల పేరుతో ప్రతిపక్షాలు సృష్టిస్తున్న రాద్ధాంతాన్ని ఎప్పటికప్పుడు పార్టీ వర్గాల ద్వారా బలంగా తిప్పికొడుతూ.. దేశ ప్రజల సంక్షేమాన్ని అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ దుర్నీతిని ఎండగట్టగలుగుతున్నారు. తద్ఫలితంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజాబాహుళ్యంలో తమకున్న ఇమేజ్ ను మరింత దిగజార్చుకున్నాయనే చెప్పొచ్చు. మోదీ నేతృత్వంలోని ఆర్థికంగా పటిష్టమైన నిర్ణయాలతో ఇప్పటికే పలుమార్లు వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించగలిగారు. ఆర్బీఐ నుంచి సెబీ వరకు ప్రతి ప్రధాన సంస్థను బ్యూరోక్రసీ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య నిబంధనలను ఒకే ఛట్రం కిందకు తీసుకువచ్చి 2014కు ముందు ఉన్న అన్ని రకాల సంక్లిష్టతలను తప్పించగలిగారు. 2014కు ముందు ప్రధాన లోపంగా ఉన్న కమ్యూనికేషన్ ను పూర్తిగా బలపర్చగలిగారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఇది నిరూపితం అవడమే గాక, ఇస్రో స్వయంప్రత్తితో చంద్రయాన్ 3 విజయవంతం, చంద్రయాన్ 4కు కీలక అడుగులు పడడాన్ని చెప్పుకోవచ్చు. సొంత ఆయుధ వ్యవస్థకు ఊతం ఇవ్వగలిగారు. మేక్ ఇన్ ఇండియాను సార్థకం చేసే పనిలో మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు. స్వాతంత్రం సిద్ధించాక కాంగ్రెస్ పాలించిన రాజకీయ మార్కుకు, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 11 ఏళ్ల పాలనకు స్పష్టమైన తేడాను దేశానికి ప్రపంచానికి చూపించగలిగిన వారు ప్రధాని నరేంద్ర మోదీ. ధృఢమైన ప్రధానమంత్రులలో ఒకరుగా ప్రపంచ ప్రఖ్యాతుల్లో ముందువరుసలో ఉన్నారు.