తొక్కిసలాట ఎఫ్ ఐఆర్ బహిర్గతం
41 మంది మృతికి విజయ్ కారణం
చెన్నై: కరూర్ తొక్కిసలాట ఎఫ్ ఐఆర్ కాపీలోని వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఇందులో పోలీసులు నటుడు విజయ్ పై ఆరోపణలు చేశారు. టీవీకే చీఫ్, నటుడు విజయ్ 41మంది మృతికి, పలువురి గాయాలయ్యేందుకు కారకులన్నారు. విజయ్ ఉద్దేశ్యపూర్వకంగానే రాజకీయ అధికారాన్ని ప్రదర్శించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు ఆరోపించారు. తొలి ర్యాలీకి ఉదయం 9 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, 11 గంటలకు చేరుకున్నారని, కరూర్ ర్యాలీకి మధ్యాహ్నం చేరుకోవాల్సి ఉండగా 7 గంటల వరకు చేరుకోలేదన్నారు. ఫలితంగా జనసమూహం ఎక్కువైందన్నారు. అనవసర అంచనాలతో ఆలస్యంగా వచ్చి ప్రసంగించారన్నారు. పైగా రోడ్ షో కోసం ఎటువంటి అనుమతి తీసుకోలేదన్నారు. పైగా జనసమూహానికి ఆహారం, నీరు, సౌకర్యాల కొరత హెచ్చరికలను పట్టించుకోలేదన్నారు. ప్రచార బస్సును ఎక్కడపడితే అక్కడే జన సమూహం మధ్య నిలిపివేశారని ఎఫ్ ఐఆర్ లో పోలీసులు పదునైన ఆరోపణలు చేశారు. కాగా టీవీకే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తొక్కిసలాటను రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. పదేపదే ర్యాలీకి అనుమతి కోరినా ప్రభుత్వం నిరాకరించారని టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పైగా జనం ఎక్కువగా ఉండని, విద్యుత్ కనెక్షన్లు కూడా లేని ప్రాంతంలో అనుమతినిచ్చారని, పోలీసు సిబ్బందిని మోహరించలేదని పలు ఆరోపణలు సంధించారు. తొక్కిసలాటకు అధికార పార్టీ సభ్యులే కుట్ర పన్నారని ఆరోపించారు.
కాగా , టీవీకే కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో బాహాబాహీ నెలకొంది. తొక్కిసలాటకు కారణం మీరంటే మీరని ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పని కల్పించారు.