బంగ్లా దౌత్యవేత్తల రీకాల్
కోల్ కతా, త్రిపుర దౌత్యవేత్తలు వెనక్కు
కోల్కతా: కోల్ కతా, త్రిపుర నుంచి బంగ్లాదేశ్ తమ దేశ దౌత్యవేత్తలను రీకాల్ చేసింది. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బంగ్లాలో మైనార్టీలపై జరుగుతున్న దాడులకు కోల్ కతా, త్రిపురలో ఉన్న బంగ్లాదేశ్ దౌత్యకార్యాలయాల వద్ద 2న నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో బంగ్లా యూనస్ ప్రభుత్వం 3న దౌత్యవేత్తలను రీకాల్ చేయాలని నిర్ణయించింది.
కోల్కతాలోని బంగ్లాదేశ్ తాత్కాలిక డిప్యూటీ హైకమిషనర్ మహ్మద్ అష్రాఫుర్ రెహమాన్ ఢాకా చేరుకున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుస్సేన్ను కూడా ఆయన కలిశారు. అగర్తలాలో జరిగిన దాడి గురించి, తాజా పరిస్థితుల గురించి అష్రాఫుర్ తౌహీద్కు తెలియజేశారు. త్రిపుర బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహ్మద్ కూడా బంగ్లాకు బయలుదేరారు. బంగ్లాదేశ్ లో భారతీయ ఉత్పత్తులను నిషేధించాలని పిలుపునిచ్చారు. పలు వస్తువులను తగులబెట్టారు. రోజురోజుకు బంగ్లాదేశ్ లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. మరోవైపు టర్కీ రక్షణ శాఖ అత్యాధునిక డ్రోన్లను కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ ఆ డ్రోన్లను సరిహద్దుల వద్ద మోహరించింది. దీంతో భారత్ అప్రమత్తమై సరిహద్దు వద్ద భారీ ఎత్తున రక్షణ చర్యలు చేపట్టింది.