24 ఏళ్లు ఒక్కరోజు సెలవు తీసుకోలే
మోదీ ఆర్థికం తెరిచిన పుస్తకమే
ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్
నాలుగో ఆర్థిక వ్యవస్థ భారత్
జీఎస్ఐ పనితీరు భేష్
నా తెలంగాణ, హైదరాబాద్: భారత్ లో 11 ఏళ్లుగా రూపాయి అవినీతి లేని పాలనను కొనసాగించి ప్రధాని నరేంద్ర మోదీ తనకంటూ, భారత్ కంటూ ప్రపంచదేశాల్లో ప్రత్యేక స్థానాన్ని, గౌరవాన్ని చాటారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. చాయ్ అమ్మే కుటుంబంలో పుట్టిన మోదీ సీఎంగా, పీఎంగా పనిచేసినప్పటికీ ఏ మాత్రం ఆస్తిపాస్తులు వెనకేసుకోలేదన్నారు. ఆయన ఆర్థికం కూడా ఒక తెరిచిన పుస్తకమే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్వాడ్ లో భాగంగా శనివారం నాగోల్ ఆనంద్ నగర్ లో ‘స్వచ్ఛతా హి సేవా’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురికి బహుమతులను అందజేశారు. అనంతరం ప్రసంగించారు.
మోదీ నాయకత్వంలో సమూల మార్పు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన ఉత్సవాలను (సేవా పక్వాడ్) నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా నీతి నిజాయితీతో సమర్థవంతంగా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారో దేశ ప్రజలందరూ చూస్తున్నారని చెప్పారు. మోదీ నాయకత్వంలో గుజరాత్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారన్నారు. గత 11 ఏళ్లుగా రూపాయి అవినీతి లేని పాలన కొనసాగించారన్నారు. జీరో టాలరెన్స్ తో ఉగ్రవాదాన్ని తరిమికొట్టారన్నారు. దేశంలో అనేక మౌలిక వసతులు రైల్వే, రహదారులు, ఎయిర్ పోర్టులు, విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, అనేక సంస్కరణలు మోదీ నాయకత్వంలో దేశంలో సమూలమైన మార్పు తీసుకువచ్చామన్నారు.
ఆ దేశాల్లోనూ ఆర్థిక సంక్షోభం..
అమెరికా, యూకె సహా చాలా ప్రపంచదేశాలు ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసి ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందేందుకు మోదీ చేసిన కృషి ఎనలేనిదన్నారు.
దేశం కోసం అహార్నిశలు..
140 కోట్ల మంది వికసిత్ భారత్ దిశలో ముందుకు వెళ్లాలన్నారు. 24 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా సీఎంగా, ప్రధానిగా పనిచేసింది కేవలం నరేంద్ర మోదీ ఒక్కరే అని స్పష్టం చేశారు. దేశం కోసం, ప్రజల కోసం అహార్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం రాజకీయ నేతల అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనను చూస్తున్నామన్నారు. కల్మషం లేని ఆలోచనతో ప్రధాని మోదీ దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు.
అత్యంత అనుభవం కలిగిన సంస్థ జీఎస్ ఐ..
సేవా పక్వాడ్ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మోదీ జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శమన్నారు. అద్భుతమైన సంస్థ జీఎస్ఐ అని కితాబిచ్చారు. 74 శాతం విద్యుత్ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుందన్నారు. జీఎస్ఐ ఖనిజాన్వేషణలో 170 సంవత్సరాల నుంచి పనిచేస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత అనుభవం కలిగిన సంస్థ అని ప్రశంసించారు. స్టీల్, ఐరన్, సిమెంట్, అల్యూమినియం, బొగ్గు లాంటి ఖనిజాలను కనిపెట్టడంలో, భూమి నుంచి వెలికితీయడంలో జీఎస్ ఐ పాత్ర ఎనలేనిదని అధికారుల పాత్రను అభినందించారు.