నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)లో మరోమారు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం, పాక్ సైన్యానికి ఈ ఆందోళనలు మరిన్ని చిక్కులు తీసుకొచ్చాయి. నిరసనకారులు పలు ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లోకి చేరుకొని నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ ను నిలిపివేసింది. ఆందోళనలకు అణచివేయాలని అధికారులను ఆదేశించింది. కాగా నిరసనలు, ఆందోళనలకు పిలుపునిస్తున్న విషయం తెలుసుకున్న ప్రజలు ముందుగానే అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున దుకాణాల్లో బారులు తీరారని, దీన్ని ఆసరాగా చేసుకున్న పలువురు వ్యాపారులు ధరలను మరింత ఎక్కువగా పెంచారని వాపోతున్నారు.
డిమాండ్లు..
పాకిస్తాన్లో స్థిరపడిన కశ్మీరీ శరణార్థులకు రిజర్వు చేయబడిన 12 అసెంబ్లీ సీట్లను రద్దు చేయడం, జల విద్యుత్ ఒప్పందాలపై తిరిగి చర్చలు జరపడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించడానికి తక్షణ పిండి సబ్సిడీలను అందించడం, నివాసితులకు ఇంధన ఖర్చులను తగ్గించడానికి విద్యుత్ సుంకాలను స్థానిక ఉత్పత్తి రేట్లకు అనుసంధానించడం వంటి బహుళ డిమాండ్లపై పెరుగుతున్న పౌరుల కోపం కారణంగా ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి.