గుండెపోటుతో జర్నలిస్టు హఠాన్మరణం
నివాళులర్పించిన టీడబ్ల్యూజేఎఫ్
నా తెలంగాణ, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు ఎన్ సీ బీంరావు యాదవ్ (60) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బీంరావు పలు దినపత్రికల్లో ముషీరాబాద్ కేంద్రంగా విలేఖరిగా పనిచేశారు. ప్రజాసమస్యలపై ఆయన రాసిన కథనాలు ప్రాచుర్యాన్ని దక్కించుకున్నాయి. ఈయన మృతిపట్ల టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మౌలాలిలోని ఇంటివద్ద భౌతికకాయాన్ని పలు జర్నలిస్టులతో కలిసి సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, ముషీరాబాద్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నాయకులు సీహెచ్ వీరారెడ్డి, కనకరాజు, సాగర్, రాంరెడ్డి, నాగరాజు, తెలంగాణ జన సమితి గ్రేటర్ అధ్యక్షుడు నర్సయ్య తదితరులున్నారు.
దత్తాత్రేయ సంతాపం..
సీనియర్ జర్నలిస్టు ఎన్ సీ బీం రావు యాదవ్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపాన్ని తెలిపారు. జర్నలిస్ట్ మరణ వార్త తనకు తీవ్ర దుఃఖాన్ని కలిగించిందన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఆయన పాత్రికేయ రంగంలో విశేష సేవలందించారని తన వార్తా కథనాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషిచేశారని తెలిపారు. బీం రావు మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.